డ్రగ్స్ కేసులో నటి రాగిణికి సమన్లు

బెంగళూరు: డ్రగ్స్ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమలను కుదిపేస్తోంది. గతంలో టాలీవుడ్లోనూ ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సిని పరిశ్రమకు చెందిన వారు విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ నటి రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. సిసిబి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కాగా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిని సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో రవి పేర్కొన్నారని, ఈ నేపథ్యంలోనే ఆమెకు సమన్లు జారీ అయ్యాయని చెప్పారు. మరోవైపు కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో కూడా డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.