తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలుజారీ చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ కురిసే అవకాశం వుంది. చెరువులు, వాగులు పొంగి అలుగుపారే అవకాశం వుంది. దీని ద్వారా చాలా ప్రాంతాలు నీటమునిగే ప్రమాదంపొంది ఉంది. ముఖ్యంగా రహదారులు నీటితో నిండిపోవడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నిజిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలుజలమయం కావడం, చెట్లు విరిగి పడిపోవడం, విద్యుత్స్తంభాలుకూలడం, వంటి సంఘటలతో సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగే అవకాశం వుంది. కాబట్టి అన్నిజిల్లాల ఉన్నతాధికారులు హెడ్క్వార్టర్స్లో ఉంటూ వరదల పై పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ అధికారులకు ఆదేశించారు.