తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు బంద్.... వీఆర్వోల నుంచి రికార్డులు స్వధీనం చేసుకోండి: ఉన్నతాధికారులకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం

హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తోంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలకు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
కాగా రాష్ట్ర వీఆర్వోలల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.