తొలి టీకా నేనే వేయించుకుంటా: వైద్యమంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణలో తొలి టీకాను “నేనే వేయించుకుంటాను“ అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వాక్సిన్ రేపు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. “ఈ శాఖకు కెప్టెన్ను.. సిబ్బంది, ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసం మొదటి టీకా తానే వేయించుకోబోతున్నట్లు“ చెప్పారు. కోట్ల మందికి ప్రాణదానం చేసిన పెన్సిలిన్ సైతం ముందుగా పరీక్ష చేసిన తరువాతనే ఇస్తారు. కాబట్టి భయపడవద్దు. కరోనాను రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
వాక్సిన్ వేసిన తరువాత అరగంట పాటు పరిశీలనలో ఉండాలన్నారు. అందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రియాక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. ఒకవేళ వచ్చినా అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు 57 కేంద్రాలను సిద్దం చేసినట్లు తెలిపారు.
కాగా తెలంగాణలో 139 కేంద్రాలను అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో తాను, సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి పాల్గొంటున్నామన్నారు. రాష్ట్రంలో మిగతా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.