దూసుకొస్తున్న `నివర్`
అధికారులకు సెలవులు రద్దు..

విశాఖ: నివర్ తుపాను దూసుకొస్తోంది. కాసేపట్లో బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కి.మీ., చెన్నయ్కి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇరాన్ సూచించిన ‘నివర్’ అనే పేరు పెడతామని ఐఎండీ అధికారులు తెలిపారు.
ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న (బుధవారం) తుపానుగా మారుతుందని.. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ.. 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు.. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఈ దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
నివర్ తుపానుతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో కర్నూలు, నంద్యాల, ఆదోనీ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు సమాచారం. మరోవైపు కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను కారణంగా కాకినాడ, అమలాపురం, 13మండలాల అధికారులకు సెలవులు రద్దుచేశారు. కాకినాడలో జరగాల్సిన సైనిక విన్యాసాలు కూడా వాయిదా పడ్డాయి. డివిజన్ కేంద్రాల్లో 24గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విపత్తనిర్వహణ శాఖలు అప్రమత్తమవుతున్నాయి. తుపాను తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100-120కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. పుదుచ్చేరి సముద్ర ప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను దిశ మార్చుకునే అవకాశమూ ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
వాయుగుండం తుపానుగా మారనుందన్న సమాచారంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్.. గంగవరం, కాకినాడ పోర్టుల్లో నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం ఓడరేవుకు అప్రమత్తత సమాచారం అందించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతులు చేతికొచ్చిన పంటల్ని వెంటనే జాగ్రత్తపర్చే ఏర్పాట్లలో ఉండాలని సూచించారు.
మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
దీని ప్రభావంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
యంత్రాంగం అప్రమత్తం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని, సరిపడా ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.
ప్రాణ నష్టం లేకుండా చూడండి : కేంద్రం
తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్గాబా సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.