పాల‌న‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి..

`గ్రేట‌ర్‌` కార్పొరేట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కెసిఆర్

హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌ర వైభ‌వం పెంచేలా కొత్త మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీ‌ల‌తారెడ్డి పాటు ప‌డాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అన్నారు. నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌, టిఆర్ ఎస్ కార్పొరేట‌ర్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రిని గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్ వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అనంత‌రం కెసిఆర్ మాట్లాడుతూ.. కార్పొరేట‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు… భాగ్య‌న‌గ‌రం వైభ‌వం ప‌విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి అని అన్నారు.

న‌గ‌ర వైభ‌వాన్ని పెంచండి..

గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలని చెప్పారు. అంద‌రినీ ఆద‌రించే ప్రేమ‌గ‌ల్ల న‌గ‌రం హైద‌రాబాద్ అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ, గుజరాతీ గల్లీ, పార్సీగుట్ట, బెంగాలీలు, మలయాళీలు, మార్వాడీలు, ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నది. అని కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

Leave A Reply

Your email address will not be published.