వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు

హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని సర్కార్ను ఆదేశించింది. కాగా కౌంటరు దాఖలుకు టైం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనర్ (ఎజి) కోరడంతో.. విచారణను ఎల్లుండి (10వ తేదీకి) వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన స్టేను ఎల్లుండి వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పూర్తిగా నిలిచిపోయినందున గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను ఎత్తి వేయాలని ఎజి హైకోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు ఆపేయాలని తామెప్పుడూ ఆదేశించలేదని.. పాత విధానంలో కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఆ వివరాలన్నీ ధరణి పోర్టల్లో నమోదు చేస్తామనే షరతు విధించి పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని సూచించింది. ఈ అంశంలో రాజ్యంగ బద్ధమైన అనేక అనుమానాలున్నందున వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపకముందే తాము అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.