వ్యవసాయ చట్టాల కమిటీ నుంచి తప్పుకుంటున్నా..

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి ఒక సభ్యుడైన భూపిందర్ సింగ్ మన్ తప్పుకున్నారు. తన నియామకంపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చల కమిటీ నుంచి వైదొలగుతున్నట్లు గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో తాను నిష్పాక్షికంగా ఉండాలని భావిస్తున్నానని, రైతుల నిరసనకు సంబంధించి ప్రజల మనోభావాల కారణంగా కమిటీ నుంచి తప్పకుంటున్నట్లు భూపిందర్ సింగ్ మన్ చెప్పారు. కమిటీ సభ్యుడిగా తనను నియమించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నూతన సాగు చట్టాలపై సుప్రీం స్టే.. చర్చల కోసం కమిటీ
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు మంగళవారం నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, భారతీయ కిసాన్ యూనియన్-మన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మన్, శెట్కరి సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రమోద్ కుమార్ జోషి సభ్యులుగా ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. కానీ కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చేవారేనని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.