నూతన సాగు చట్టాలపై సుప్రీం స్టే.. చర్చల కోసం కమిటీ

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై కమిటీని ఏర్పాటు చేయబోనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని కోర్టు చెప్పింది. అన్ని రైతు సంఘాల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించాలని చీఫ్ జస్టిస్ బోబ్డే తెలిపారు. న్యాయ ప్రక్రియ పట్ల రైతు సంఘాలు విశ్వసనీయత చూపాలన్నారు. రైతులు సహకరించాలని, ఈ సమస్యను పరిష్కరించడమే తమ ఉద్దేశం అని సీజే అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కావాలనుకుంటే, అప్పుడు కోర్టు జోక్యం అవసరమని లేదంటే మీరు ఆందోళన కొనసాగించవచ్చు అని సీజే అన్నారు. వ్యవసాయ చట్టాల అంశంపై విచారణ జరిగిన సమయంలో పిటీషనర్ల తరపున ఎంఎల్ శర్మ మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులను ఒకేసారి కలిసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మాత్రమే నిర్ణయం తీసుకోగలరన్నారు.
కమిటీ సభ్యులు వీరే..
హరిసిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, భూపేంద్ర సింగ్ మాన్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారని కోర్టు పేర్కొంది. అశోక్ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్కు గతంలో చైర్మన్గా వ్యవహరించారు. ప్రమోద్ జోషి జాతీయ వ్యవసాయ అకాడమీ సంచాలకులుగా పనిచేశారు.
అయితే ఈ విషయంలో తాము ప్రధానికి ఎటువంటి దిశానిర్దేశం చేయలేమని ప్రధాన సిజె అన్నారు. రైతు సంఘాలతో ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చించినట్లు సొలిసిటర్ జనరల్ హారీశ్ సాల్వే తెలిపారు. ప్రస్తుతానికి వ్యవసాయ చట్టాలను సస్పెండ్ చేస్తున్నామని, కానీ శాశ్వతంగా ఆ చట్టాలను సస్పెండ్ చేయలేమని సీజే తెలిపారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియను సాల్వే స్వాగతించారు.