శశికళ సంచలన నిర్ణయం
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడిఎంకే బహిషృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజాజీవితం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. జనవరిలో జైలు నుంచి విడుదలైన శశికళ తమిళ రాజకీయాల్లో క్రీయాశీలకపాత్ర పోషించనున్నట్లు అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆమె నిర్ణయం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. తమిళనాడు అసెంబ్లీకి మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి అదేవిధంగా ప్రజా జీవితం నుంచి ఆమె తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
బుధవారం రాసిన లేఖలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. జయలలిత బ్రతికుండగా తాను ఏ పదవీ చేపట్టాలని అనుకోలేదని.. ఆమె మరణానంతరం కూడా ఆ విధంగానే కొనసాగాలని అనుకున్నట్లు తెలిపారు. అలాగే ఏఐడీఎంకే పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అన్నాడిఎంకె కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, జయలలిత వారసత్వం కొనసాగాలని ఆకాంక్షించారు. డీఎంకే పార్టీని ఓడించాలని ఏఐఏడీఎంకే కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.