`సుప్రీం`లో ఎపికి చుక్కెదురు

ఢిల్లీ: ఎపి సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను గురువారం తిరస్కరించింది. ఈ క్రమంలో ఎస్ఎల్పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఏపి సర్కార్ తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాని్న తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని ఆయన అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని విశ్వనాథన్ వాదించారు. తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని సుప్రీంకోర్టుకు విశ్వనాథన్ తెలిపారు.
ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది శంకర్నారాయణ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని సుప్రీంకోర్టుకు శంకర్ వివరించారు. తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తున్నదని ప్రతివాదుల శంకర్నారాయణ న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురు వాదనలు, ప్రతినాదలు విన్న సుప్రీంకోర్టు ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.కాగా ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కేవియట్ వేసిన తల్లిదండ్రులు ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను 25కి వాయిదా వేసింది.