స్టార్స్ పారితోషికంలో 20 శాతం కోత..
హైదరాబాద్: కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం విషయంలో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో నటీ నటులతో పాటు టెక్నీషియన్ల పారితోషికాన్ని 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 20 వేల రూపాయాలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.
రోజుకు రూ.20 వేలలోపు తీసుకునే వారి పారితోషికాలు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది. ఒక సినిమాకు ఐదు లక్షలకు మించి పారితోషికం తీసుకునే సాంకేతిక నిపుణులు కూడా రెమ్యునరేషన్లో 20 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది నటులు, సాంకేతిక నిపుణులు సహకరించాలని ఈ సందర్భంగా తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ కోరింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా), ఏటీఎఫ్ పీజీ మధ్య అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఈ నియమంపై మరోసారి సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది.
