హిట్లిస్ట్లో రాజాసింగ్..

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల హిట్లిస్టులో రాజాసింగ్ పేరున్నట్టు తెలుస్తోంది. టెర్రరిస్ట్ల నుంచి ముప్పు ఉందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు ఉన్నట్లు పోలీసులు ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు పోలీసులు తన ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారని వెల్లడించారు. కాగా ద్విచక్రవాహనంపై తిరుగరాదని, ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని సూచనలు చేశారని రాజాసింగ్ తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తన భద్రత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో హైదరాబాద్ సీపీకి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశానని, ఇప్పటికైనా తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని పోలీసుశాఖకు రాజాసింగ్ విజ్క్షప్తి చేశారు. స్లమ్ ఏరియా కాబట్టి తన నియోజకవర్గంలో కారులో వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరితో ముప్పు ఉందనే విషయాన్ని తెలియపరచాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ముప్పు విషయంలో కేంద్రం, ఐబీ, ఇంటలిజెన్స్ నుంచి తనకు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కాగా ఉగ్రవాదుల హిట్లిస్టులో రాజాసింగ్ పేరుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడకు వెళ్లాలన్నా పోలీసులకు ముందస్తు సమాచారం అడుగుతున్నారు. కాగా రాజాసింగ్ ఎప్పడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అవసరమైతే సొంతపార్టీ నేతలపై స్వరం పెంచుతారు. అలాంటి రాజాసింగ్ హిట్ లిస్ట్లో ఉన్నారని పోలుసులు హెచ్చరించడం అందరూ చర్చించుకుంటున్నారు.