DRDO: అందుబాటులోకి 2DG ఔషధం..
విడుదల చేసిన కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): కొవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసంం భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) ఔషదం విడుదలైంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు.
మొదట రక్షణ మంత్రి డ్రగ్ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా.. డ్రగ్స్ను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్ఆడుతూ.. 2DG ఔషధంతో కొవిడ్ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో DRDO కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే.
తొలి వడతగా 10 వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. అయితే దీని ధరను ఇంకా ప్రకటించలేదు.