అనాథ‌గా మృతి చెందిన పాతాళ భైరవి హీరోయిన్ మాలతి

టివిజి: సినిమా సిత్రాలు

కె.మాలతి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని. కె.మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారిగుణసుందరి కథ (1949), అందులో శాంతకుమారితో కలిసి కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, చల్లని దొరవేలే చందమామ పాటలు పాడింది. 1951లో విజయా వారి పాతాళ భైరవిలో ఆమెకు పి.లీల పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత శ్రీ కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తో నటించింది.

బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం.

పాతాళ భైరవి 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. ఈ శతదినోత్సవం వేడుకలకు మాలతి హాజరై అందరి మన్ననలను పొందారు.1965 వరకూ చిన్న పాత్ర లను కూడా వేశారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి, అదే ఎన్టీఆర్ సరసన అక్కగా, వదినగా తల్లిగా నటించారు.ఎఎన్ఆర్ కు సోదరిగా, తల్లిగా కూడా నటించారు. 1969లో తన మకాం హైదరాబాద్ కు మార్చారు. కాచిగూడలో ఒక మురికి వాడలో నివశించారు.

అక్కడ అద్దె చెల్లించలేని స్థితిలో ప్రభాస్ ధియేటర్ వెనుక గోడను ఆనుకుని ఒక రేకులు షెడ్ వేసుకొని పిలిపించారు.అపుడే తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ కు తరలి వస్తున్న రోజులు.హైదరాబాద్ సారధీ స్టూడియో కు ప్రతీ రోజూ వెళ్ళి వచ్చినా వేషాలు ఉండేవి కావు.తాను పాతాళ భైరవి హీరో యిన్ మాలతి అని ఎవ్వరికీ చెప్పలేదు. భర్త చనిపోయాడు. సంతతి లేదు. కడుపారా తిండిలేక కాచిగూడలో దేవాలయానికి వెళ్ళి పూజారి ఇచ్చే ఫలహారాలతో జీవిస్తూ ఉండేవారు. అక్కడ దేవాలయం లో ఒక మహిళతో మాట్లాడుతూ ఉండేవారు. 1979 నవంబర్ 22న హైదరాబాద్ లో గాలివానకు అర్థరాత్రి ప్రభాస్ థియేటర్ గోడ కూలి మాలతి మరణించారు. 23న కూడా ఆమె మృతదేహం అక్కడే శిథిలాల వద్ద కూరుకుపోయింది.

 

ఇదిలా ఉండగా రోజూ గుడికి వచ్చే మాలతి గత రెండు రోజులుగా రాకపోవడంతో పూజారి, ఆమె స్నేహితురాలు ఆరా తీశారు. ఆమె స్నేహితురాలు థియేటర్ వెనుక శిధిలాలను ఇరుగు పొరుగు వారి సాయంతో వెతికి తీయగా మాలతి మృతదేహం, ఒక టంకుపెట్టె బయటపడింది. ఆ టంకుపెట్టెలో పాతాళ భైరవి ఫోటో లు, షీల్డ్ లు కనపడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె డైరీలో తాను నటించిన చిత్రాలు వివరాలు, పడిన కష్టాలు, మోసపోయిన విధం ఉండడంతో అక్కడ ఉన్నవారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అందరూ చందాలు వేసుకొని మాలతి అంత్యక్రియలు జరిపారు. ఇంత జరిగినా అప్ఫటి థియేటర్ యాజమాన్యం స్పందించక పోవడం విశేషం. నాడు అగ్రహీరోలు గానీ ఆమెతో నటించిన వారెవ్వరూ ఆమె మృతదేహం వంక పట్టించుకో లేదు. సినిమా థియేటర్ కు మాలతి పేరు పెట్టమని ఫిలిం జర్నలిస్టులందరూ అప్పటి యాజమాన్యానికి వివరించినప్పటికీ ఫలితం లేదు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.