ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. కాగా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా.. లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. కాగా ప్రస్తుతం దర్శనాలు నిలిపివేశారు.