ఇక ఒటిపి నమోదు చేస్తేనే ఎటిఎంలో నగదు

న్యూఢిల్లీ : ఇక ఎటిఎంల ద్వారా రూ.10 వేలకు మించి తీసుకోవాలంటే వన్ టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) నమోదు తప్పనిసరి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది ఎటిఎం ఉపయోగించి డబ్బు తీసుకునేవారికి మాత్రమే. ఇక నుంచి ఎటిఎంల ద్వారా రూ.10 వేలకు మించి తీసుకోవాలంటే వన్ టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) ఆధారిత విత్డ్రాయల్ సిస్టమ్ను అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎటిఎంలో నగదు ఉపసంహరణకు తీసుకొచ్చిన కొత్త నిబంధన నేటి (శుక్రవారం) నుంచి అమల్లోకి రానుంది. ఎస్బిఐ ఎటిఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఒటిపి ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) రూ.10 వేలు, అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్తోపాటు ఒటిపి నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసి ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే ఒటిపి నమోదు చేస్తేనే ఎటిఎంలో నుంచి నగదు వస్తుంది. ఒటిపి లేకపోతే రూ.10 వేలకు మించి నగదు తీసుకోలేరు. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బిఐ ఎటిఎంల్లో రూ.10 వేలకు మించి చేసే ఉపసంహరణలకు ఒటిపి సిస్టమ్ అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బిఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్బిఐ నిర్ణయించింది.