ఎపిలో కొత్తగా 9,901 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఎపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,901 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,57,587కు చేరింది. గడిచిన 24 గంటల్లో 67 మంది కరోనాతో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,846కు చేరింది. ప్రస్తుతం 95,733 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 4,57,008 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 75,465 మందికి పరీక్షలు చేయడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 45,27,593కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
గోదావరి జిల్లాల్లో ఉగ్రరూపం
ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా తూ.గో జిల్లాల్లో 1398 పాజీటివ్ కేసులు రాగా. ప.గో జిల్లాలో 1069 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 1146, చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరణాలు
కడపలో 9 మంది, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపురం, తూ.గో జిల్లాల్లో ముగురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు.