ఎపి నెం.1, తెలంగాణ నెం.3

హైదరాబాద్/ అమరావతి: సులభతర వాణిజ్యం విభాగంలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా, తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి చేరింది. రెండో స్థానాన్ని ఉత్తర్ప్రదేశ్ ఆక్రమించింది. గతంలో 12వ స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్డౌన్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందు వరుసలో ఉందని కేంద్రం ప్రకటించింది.
ఏపీ నెంబర్ వన్.. మంత్రి గౌతమ్ రెడ్డి హర్షం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ వన్ ర్యాంకు రావడంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్ ర్యాంక్ వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి శనివారమిక్కడ మాట్లాడుతూ… కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చారని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు