ఐదుగురు భారతీయలను అపహరించిన పీఎల్ఏ

ఇటానగర్: అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు అపహరించారు. చైనా-ఇండియా సరిహద్దుల్లో ఉన్న ఎగువ సుబాన్సిరి జిల్లాలోఈ ఘటన జరిగింది.. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించినట్టు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. చైనా, భారత్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. జిల్లాలోని నాచో ఏరియాలో శుక్రవారంనాడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అహరణకు గురైన వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేటకు వెళ్లిన గ్రూపులోని ఇద్దరు ఎలాగో తప్పించుకుని పోలీసులకు ఆ విషయం ఫిర్యాదు చేశారు. కాగా, అపహరణకు గురైనట్టు చెబుతున్న వ్యక్తులను టాచ్ సింగం, ప్రసత్ రింగ్లింగ్, దాంగ్టు ఇబియ, తను బకెర్, నగగ్రు డిరిగా గుర్తించారు. వీరంతా టగిన్ కమ్యూనిటీకి చెందిన వారు.
జిల్లా ప్రధాన కార్యాలయానికి 120 కిలోమీటర్ల దూరంలో నాచో ఉంది. అపహరణకు గురైన వ్యక్తులను అధికారులు వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా నాచో పోలీస్స్టేషన్కు విచారణ అధికారిని పంపించామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.