కరీంనగర్లో కాలిబూడిదైన కొత్త ట్రాన్స్ఫార్మర్లు

కరీంనగర్: కరీంనగర్లో విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి భుగ్గయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున్న ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయినట్లు తెలుస్తోంది.