కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురూ
విదేశాలకు సోనియా, రాహుల్

న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) అప్పగించిన అధికారం మేరకే అధినేత్రి సోనియాగాంధీ సంస్థాగత మార్పులను చేపట్టారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకే ఆమె ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారని వివరించింది. తాజా మార్పులపై కొందరు నేతల ప్రకటనలపై కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలెవరూ ఎటువంటి ప్రకటనా చేయలేదని, వ్యాఖ్యానించలేదని అన్నారు. సోనియా చేపట్టిన సంస్థాగత మార్పులపై రాహుల్ గాంధీ ముద్ర ఉందా అని అడగ్గా.. రాహుల్ గాంధీని ఏఐసీసీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నుకుందనీ, 2019 ఎన్నికల ఫలితాలకు బాధ్యతవహిస్తూ ఆయన వైదొలిగారని గుర్తు చేశారు. కోట్లాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు సీడబ్ల్యూసీ కూడా సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించాయన్నారు. మరోవైపు, క్రమం తప్పకుండా జరిగే మెడికల్ చెకప్ కోసం శనివారం ఉదయం కొడుకు రాహుల్ గాంధీతో కలిసి సోనియాగాంధీ అమెరికా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
విదేశాలకు సోనియా, రాహుల్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్గాంధీలు సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. దీంతో సోమవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరుకావడంలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్వయంగా ట్వీటర్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక తిరోగమనం, కరోనా మహమ్మారి నివారణపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ప్రశ్నలను పార్లమెంటులో లేవనెత్తేలా సోనియాగాంధీ తమ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సోనియాగాంధీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసిన రెగ్యులర్ హెల్త్ చెకప్ల కోసం ఈ రోజు విదేశాలకు వెళ్లనున్నారని, ఆమెతో పాటు రాహుల్గాంధీ కూడా వెళ్లనున్నట్లు సుర్జేవాలా ట్వీట్ చేశారు.