కొవిడ్: 70%.. ఆ 8 రాష్ట్రాల్లోనే..

ఢిల్లీ : భారత్ లో కొవిడ్ మహమ్మారి తీవ్రమవుతోంది. చలి తీవ్రత.. పండగలు.. పెళ్లిళ్ల సీజన్ ఇలా రకరకాల కారణాలతో వైరస్ మళ్లీ పెరుగుతోంది. దాంతో దేశంలో ఇప్పుడు కోవిడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 4,55,555 కు చేరింది. అంటే, పాజిటివ్ గా నమోదైన వారి మొత్తం సంఖ్యతో పోల్చుకున్నప్పుడు చికిత్సలో ఉన్నది 4.89 శాతం మాత్రమే. చికిత్సలో ఉన్నవారిలో గరిష్ఠంగా దాదాపు 70 శాతం మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారే. ఆ జాబితాలో మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.
అత్యధికంగా మహారాష్ట్రలోనే..
శుక్రవారం ఉదయం నాటికి దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 93,09,787కు చేరింది. ఇందులో ఇప్పటి వరకు 87,18,517 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 4,55,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇందులో 70 శాతం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలోనే అని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 87,014 కోవిడ్ బాధితులు ఉండగా, రెండో స్థానంలో ఉన్న కేరళలో 64,615 మంది, ఢిల్లీలొ 38,734 మంది చికిత్సలో ఉన్నారు. గడిచిన 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులలో వచ్చిన మార్పు దిగువ చిత్రంలో ఉంది. మహారాష్ట్రలో అదనంగా 1526 కేసులు రాగా చత్తీస్ గఢ్ లో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 719 తగ్గింది. గడిచిన 24 గంటలలో 43,082 మందికి కొత్తగా కరోనా సోకింది. వీళ్లలో 76.93శాతం మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. మహారాష్ట్రలో ఈ ఒక్క రోజులో అత్యధికంగా 6,406 కేసులు రాగా ఢిల్లీలో 5,475 మందికి, కేరళలో 5,378 మందికి కొత్తగా కరోనా సోకింది.
రికవరీల్లో కేరళ ముందంజ..
దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటి 87,18,517 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్న శాతం ఈ రోజుకు 93.65% కు చేరింది. గత 24 గంటలలో 39,379 మంది కోలుకోగా తాజాగా కోలుకున్నవారిలో 78.15శాతం పది రాష్ట్రాలనుంచే నమోదైంది. కేరళలో అత్యధికంగా ఒకరోజులో 5,970 మంది కోలుకోగా ఢిల్లీలో 4,937 మంది, మహారాష్ట్రలో 4,815 మంది కోలుకున్నారు.
అత్యధిక మరణాలో ఆ 10 రాష్ర్టాల్లోనే..
భారత్లో ఇప్పటివరకు 1,35,715 మంది కొవిడ్కు బలయ్యారు. కాగా మొత్తం మరణాల్లో దాదాపు 84 శాతం కేవలం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మహారాష్ట్రలో అత్యధికంగా 34.49శాతం మరణాలు నమోదు కాగా ఆ రాష్టంలో మొత్తం మరణాలు 46,813 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 492 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 75.20శాతం మంది పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. 91 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (65), పశ్చిమ బెంగాల్ (52) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.