కోడె మొక్కు చెల్లించిన ముస్లిం మహిళ!
వేములవాడ: మత సామరస్యానికి నిజమైన ఉదాహరణ ఇది.. వేములవాడలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో రాజన్నను మంగళవారం ఓ ముస్లిం దర్శించుకుంది. కోడెమొక్కు చెల్లించుకుంది. మంథనికి చెందిన ముస్లిం మహిళా భక్తురాలు అఫ్సర్ శాసిత రాజన్న ఆలయంలో పూజలు చేసి కోడెమొక్కు చెల్లించుకుంది. ఎప్పటి నుండో ఇక్కడికి రావాలనుకున్నానని, ఈ సందర్భంగా మొక్కు చెల్లించుకున్నానని సదరు ముస్లిం మహిళ పేర్కొంది.
కాగా ఆలయ చరిత్రలో ఒక ముస్లిం మహిళ కోడే మొక్కులు చెల్లించేందుకు అనుమతించడం ఇదే మొదటిసారి అని ఆలయ అధికారులు తెలిపారు. ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా, వేములవాడ ఆలయ ప్రాంగణంలో దర్గా ఉంది. అయితే భక్తులు సాధారణంగా రాజన్న దర్శనం పొందిన తరువాత దర్గాను కూడా సందర్శిస్తారు. గతంలో, మమడా జెడ్పిటిసి సభ్యుడు మొహద్ రఫీ, అతని కుటుంబ సభ్యులు కూడా ఆలయంలో కోడె మొక్కులు చెల్లించారు.