చెన్నైలో మరో ముగ్గురికి కరోనా కొత్త వైరస్
చెన్నై: ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా కొత్త వైరస్ అలజడి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్కు మూలకేంద్రమైన యూకే నుంచి వచ్చినవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తున్నది. తమిళనాడులో కొత్తగా మరో ముగ్గురికి ఈ బ్రిటన్ వైరస్ సోకింది. దీంతో చెన్నైలో కొత్త తరహా కరోనా బారినపడినవారి సంఖ్య నాలుగుకు చేరింది. చెన్నైలో బ్రిటన్ నుంచి వచ్చిన మరో ముగ్గురికి యూకే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. రాధాకృష్ణ స్పష్టం చేశారు. వారందరిని నగరంలోని కింగ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాగా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మరో 12 మంది నమూనాలను పుణె వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించామని వెల్లడించారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.