తెలంగాణలో మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా

హైదరాబాద్: కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడి కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలను రండు రోజుల క్రితం కోరారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీ ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు.
ఎపిలో రూ. 1000 జరిమానాలు
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎపి సర్కార్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంది. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాస్థాయిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి రూ. 1000 వరకు జరిమానా విధిస్తున్నారు.
కర్ణాటకలో ఆర్టీపిసిఆర్ పరీక్షలు
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి అక్కడ సర్కార్ ఆర్టీపిసిఆర్ పరీక్షలు తప్పని సరి చేసింది. ఏప్రిల్ 1నుండి ఇది అమలు చేస్తున్నారు.
ఢిల్లీలో రూ.500 నుండి రూ.2000
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర సర్కార్ పలు నిర్ణయాలు తీసకుంది. మాస్కు తప్పనిసరి చేసింది. మాస్కులు దరించనివారికి గతంలో విధించిన రూ.500 జరిమానాను రూ.2000లకు పెంచింది.
మహారాష్ట్రలో రూ.200
దేశంలో మహారాష్ట్రలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇక్కడ రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముంబయి కార్పొరేషన్ పరిధిలో మాస్కులు ధరించకపోతే రూ.200 వరకు జరిమానా విధిస్తోంది.