తెలంగాణ తొలి మ‌హిళా క‌మిష‌న్ గా సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్ర‌వారం బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

చైర్‌ప‌ర్స‌న్‌, స‌భ్యుల నేప‌థ్యం..

  • సునీతా ల‌క్ష్మారెడ్డి.. సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లా గోమారం సర్పంచ్‌తోపాటు శివ్వంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. మెదక్‌ జిల్లా రైతుసంక్షేమం సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • గ‌ద్ద‌ల ప‌ద్మ.. కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైన గద్దల పద్మ ఉమ్మడి వరంగల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె అంగన్‌వాడీ టీచర్‌గా.. అంతకుముందు బీడీ కార్మికురాలిగా కూడా పనిచేశారు.
  • రేవతిరావు.. పెద్దపల్లికి చెందిన రేవతిరావు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు.
  • సూదం ల‌క్ష్మి.. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన సూదం లక్ష్మి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.
  • కుమ్రం ఈశ్వ‌రీబాయి.. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కుమ్ర ఈశ్వరీబాయిది వ్యవసాయ కుటుంబం.
  • షాహీన్ అఫ్రోజ్‌.. హైదరాబాద్‌ నగరానికి చెందిన షాహీన్‌ అఫ్రోజ్‌ మలక్‌పేట మార్కెట్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.
  • కొమ్ము ఉమాదేవి.. కొమ్ము ఉమాదేవిది మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి. టీఆర్‌ఎస్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు.

కాగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.