నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం
సర్పంచ్ సహా భార్య పిల్లలు దుర్మరణం
నిడమనూరు: నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ సహా నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు మృతిచెందారు. నిడమనూరులో బీభత్సం సృష్టించిన లారీ. మొదటగా ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. మొత్తంగా నలుగురు మృతిచెందారు.

వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ నిడమనూరు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఎస్ వాహనాన్ని బలంగీ ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి ఆ వాహనం పక్కకు ఒరిగింది. అదే సమయంలో వెనుకే వస్తున్న ద్విచక్రవాహనంపైకి టాటా ఎస్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీనివాస్(34), ఆయన భార్య విజయ(30) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్ కూతురు శ్రీవిద్య(5), కుమారుడు కన్నయ్య(3) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. టాటా ఎస్ వాహనంలో ఉన్న వారిలో ముగ్గురు గాయపడగా వారికి మిర్యాలగూడ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ వెంకటేశ్వరరావు, హాలియా సిఐ వీరా రాఘవులు, స్థానిక ఎస్సై కొండల్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.