నిరుద్యోగులకు కెటిఆర్ శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి కెటిఆర్ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఈ సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 14 వేలకు పెంచగలిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశంలో పరిశ్రమలకు సరిపడా కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే మాత్రమేనన్నారు.
“తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ సమస్య లేదన్నారు. భవిష్యత్తులో ఇక కరెంట్ పోదని ఖచ్చితంగా చెప్పగలమన్నారు.
“ అంధకారమయం అవుతుంది.. చీకట్లు అలముకుంటాయి.. అనేలా ఉన్న తెలంగాణలో ఇవాళ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశంలో ఎక్కడికి వెళ్లినా మా రాష్ట్రంలో కరెంట్ పోవట్లేదని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కరెంటు కోతలు ఉండేవి.. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కోతలుండవని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం“ అని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
అన్ని రంగాల్లో కలిపి 1.31 లక్షల ఉద్యోగాలను కెసిఆర్ సర్కార్ ఇచ్చింది. తాజాగా మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ఒక శిశువు జన్మిస్తే ప్రభుత్వం అందించే కెసిఆర్ కిట్ మొదలు విదేశాలకు వెళ్లి చదువుకునేంత వరకు వివిధ పథకాల రూపంలో అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటోంది. ఇదే వరుసలో త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా వస్తోంది అని తెలిపారు.