నేటి అర్థరాత్రి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ మధ్య కీలక ఒప్పందం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు ఫలించాయి. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్లో తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీల కీలక భేటీ జరిగింది. ఇరు రాష్ర్టాల మధ్య అంతర్ రాష్ర్ట బస్సు సర్వీసులపై కీలక చర్చలు జరిపారు. ఇప్పటికే ఇరు రాష్ర్టాల ఆర్టీసీ బస్సులు తిప్పే కిలోమీటర్లపై ఏకాభిప్రాయం కుదిరిన విషయం తెలిసిందే.
ఏపీలో 826 బస్సులను లక్షా 61 వేల 258 కిలోమీటర్ల మేర టీఎస్ ఆర్టీసీ నడపనుంది. తెలంగాణలో 638 బస్సులను లక్షా 60 వేల 999 కిలోమీటర్ల మేర ఏపీ ఆర్టీసీ నడపనుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులను నడపాలని నిర్ణయించగా, తెలంగాణలో ఏపీ 638 బస్సులను నడపనుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ విజయవాడ రూట్లో 273 బస్సులను నడపనుంది. అదే రూట్లో ఏపీ 192 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది.
లాక్డౌన్ దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీలు నిలిచిపోయాయి. అనంతరం కరోనా ఉధృతి తగ్గినా, అన్లాక్ ప్రక్రియ నడిచినా బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. పలుమార్లు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. ఎట్టకేలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీంతో నేటినుంచే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.