నేడు, రేపు భారీ వర్షాలు !
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో.. సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సోమవారం రాత్రి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్, విశాఖపట్నం ల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ అధికారి రాజారావు వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు సమాచారం. విశాఖకు ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల, కాకినాడకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నది. విశాఖ-నరసాపురం మధ్య ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో.. సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సోమవారం రాత్రి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్, విశాఖపట్నం ల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ అధికారి రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి ఈ వాయుగుండం నర్సాపూర్కు ఆగేయ దిశలో 450 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉంది. అండమాన్ దీవులకు ఉత్తర ప్రాంతంలో ఈనెల 14 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. కర్నాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనముంది. అటు తెలంగాణలోనూ రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత రెండు రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్లో భారీ వర్షం
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులుగా ఉన్న ఆకాశం.. ఉన్నట్టుండి ఉదయం 11:30 గంటల సమయంలో కుండపోత వాన కురిసింది. ఈ భారీ వర్షానికి నగరం జలయమం అయింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట, అల్వాల్, బోయిన్పల్లి, తార్నాక, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కర్మన్ఘాట్, సంతోష్ నగర్, చార్మినార్, మలక్పేట, జూపార్క్, లంగర్హౌస్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వాన పడింది.
రైతన్నల ఆందోళన
ఆరుగాలం కష్టించి వేసిన పంట పూత, కోత దశలో ఉండగా.. వర్షపు నీరు పంటలను ముంచెత్తడం రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది. 10 సెంటీమీటర్లకు మించి వర్షం కురుస్తోన్న ప్రారతాల్లో పైర్లు పూర్తిగా నేలవాలిపోతున్నాయని వ్యవసాయాధికారులు ఆవేదన చెందారు. పంటల మునక, నష్టాలపై వ్యవసాయ శాఖాధికారుల నుండి ఎలాంటి సమాచారం ఇంతవరకు విడుదల కాలేదు. పంట చేల నుండి వర్షపు నీటిని వెంటనే బయటికి వెళ్లేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తగ్గుతుందని వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు.
వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో కురుస్తున్న భారీ వర్షాలతో ఉభయ తెలుగు రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.