పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్తూ.. కుప్పకూలిన నవ వధువు
భువనేశ్వర్: పెళ్లయ్యాక పుట్టింటి నుంచి అత్తారింకి వెళ్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన నవ వదువు గుండె ఆగి కుప్పకూలిపోయిన విషాద ఘటన ఒడిశాలోని సోనేపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. జిల్లాకు చెందిన ఓ యువతికి బాలాంగిర్ జిల్లా యువకుడితో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లయ్యాక కొత్తపెళ్లి కూతురును చీరె,సారెతో ఘనంగా అత్తారింటికి పంపేదుకు కుటుంభ సభ్యులు, బంధువులు, స్థానికులు ఏర్పాట్లు చేశారు. ఇక తాను పుట్టింటిని వదిలి వెళ్లాలనే బెంగతో నవ వధువు తల్లి, తోడబుట్టిన వారి విడిచి వెళ్లలేక గుక్కపెట్టి వెక్కి.. వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బంధువు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ నవ వధువు మరణించినట్లు తెలిపారు. వధువుకు గుండెపోటు వచ్చిందని, అది ఆమె మరణానికి దారితీసిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, పోస్టుమార్టం అనంతరం పోలీసులు మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ మధ్యకాలంలోనే వధువు తండ్రి మరణించడంతో ఈ వివహాన్ని బంధువులు, పలు స్వచ్చంధ సంస్థలు కలిపి జరిపించారు. కాగా స్థానికంగా ఈ వార్త పలువురుని కంటతడిపెట్టించింది.