పోలీస్స్టేషన్లలో సిసి టివిలు ఉండాల్సిందే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఇకపై దేశంలోని అన్ని పోలీస్స్టేషన్లతో పాటు సిబిఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వంటి విచారణ సంస్థల్లో రాత్రి నిఘా వ్యవస్థ, ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్లతో కూడిన సిసిటివిలు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కస్టడీలో పోలీసుల హింసించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని పోలీస్స్టేషన్లలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. నిందితులను విచారించే గదులు, లాకప్లు, ప్రవేశ, బయటకు వెళ్లే దారుల్లో కెమెరాలు ఉండాలని ఆదేశించింది. విచారణ సంస్థల్లో చాలావరకు వారి కార్యాలయాల్లోనే నిందితులను విచారిస్తుంటారని, దీంతో రికార్డింగ్ సదుపాయాలతో సిసిటివిలు అన్ని కార్యాలయాలో తప్పనిసరిగా ఉండాలని జడ్జి పేర్కొన్నారు. ఈ ఆడియో, వీడియో రికార్డింగ్లను 18 నెలల పాటు ఆధారాలకోసం నిక్షిప్తం చేయాలని అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.