పదిహేనేళ్లలో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరాన్ని చలి గజగజలాడించేస్తోంది. రోజురోజుకు నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు, చలిగాలులు ఢిల్లీని కమ్మివేశాయి. గురువారం కనిష్టంగా 3.3 డిగ్రీల సెల్సియస్ నమోదైన ఉష్ణోగ్రత… శుక్రవారం 1.1 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. గత 15 సంవత్సరాలలో ఇదే అత్యంత కనిష్టం అని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. 2006 జనవరి 8 నగరంలో కనీస ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆ తర్వాత ఇదే అత్యంత కనిష్టం. అయితే గతేడాది జనవరి కనిష్ట ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండి తెలిపింది. అయితే, జనవరి 2 నుండి జనవరి 6 వరకు కనీస ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుందని ఐఎండి ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి శ్రీవాస్తవ చెప్పారు. జనవరి 4-5 నాటికి కనీస ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందని అంచనా.