విశాఖలో కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు..

విశాఖపట్టణం: విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటిఆర్కు అక్కడి కార్మికులు, ప్రజలు జై కొడుతున్నారు. కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ కోసం కదులుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కెటిఆర్ మద్దతు ప్రకటించడంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్పరం చేశారని కెటిఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు. వీలైతే విశాఖకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు.
కెటిఆర్ మద్దతు ప్రకటపై ఆనందం వ్యక్తం చేశారు కార్మికులు. కేటీఆర్ నిర్ణయాన్ని కార్మికులతో పాటు ప్రజలకు కూడా ఆహ్వానించారు. ఇక, ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు కార్మికులు. సమ్మెబాట పడుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు.. యాజమాన్యానికి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలందరం కలిసి పోరాడి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు. తెలుగు వారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.