వేలాల మల్లన్న జాతార ఆదాయం రూ. 43 లక్షలు
జైపూర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాల మల్లికార్జున స్వామి జాతర భక్తజన సంద్రం మద్య కనుల పండువలా సాగింది. ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత భక్తులతో వేలా గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మొదటి రోజుఉ గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు రెండో రోజు గుట్ట కింద మల్లన్న దర్శనానికి బారులు తీరారు. భారీగా భక్తుల రాకతో వేలాల శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు ఈ సంవత్సరం రూ. 43 లక్షల ఆదాయం వచ్చింది. కాతర ముగియడంతో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గట్టు మల్లన్న స్వామి (గుట్టపైన)కి రూ . 15,97,341 నగదు, 21 గ్రాముల మిశ్రమ బంగారం, 398 గ్రాముల వెండి, వేలాలలోని మల్లికార్జున స్వామి వారికి రూ. 27, 13,603 నగదు, 4 గ్రామాలు మిశ్రమ బంగారం, 262 గ్రాముల వెండి సమకూరింది. అన్నీ కలిపి రూ. 43,10,944 ఆదాయం వచ్చింది. అయితే గత సంవత్సరం రూ. 42,72,610 ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 38,334 ఆదాయం పెరిగింది.

ఆలయ చరిత్ర..
సుమారు రెండు వందల సంవత్సరాల కిందట వేలాల గ్రామంలో గుట్టపైన గట్టుమల్లన్న కొలువైనట్లు గ్రామ పెద్దలు చెబుతుంటారు. గ్రామానికి చెందిన కోగిల పుల్లు అనే బాలుడు ఆవులను తోలుకుని గుట్టపైకి వెళ్తుండేవాడు. ఎప్పటి లాగే ఒకసారి గుట్టపై ఆవులను వదిలి ఆ ఆప్రాంతంలోని దొనలో ఆడుకునేవాడు. కాలక్రమేణ బాలుడు దొనలో అదృశ్యమై గట్టు మల్లన్నగా ఇక్కడ కొలువైనట్లు పురాణ గాథ. ప్రజలు ఆ దొన దగ్గరకు వెళ్లి తమ కోరికలు, బాధలు చెప్పుకుంటే తీరుతుండటంతో కాలక్రమేన భక్తుల తాకిడి పెరిగిందని చెబుతుంటారు. మహా శివరాత్రి రోజు గోదావరిలో స్నానమాచరించి మట్టి కుండలో గోదావరి నీటిని తీసుకెళ్లి బోనం వండి దేవుడికి పెట్టడం ఆనవాయితీ. ఉదయం గట్టుపైన జాతర.. అనంతరం వేలాల ఆలయంలో శివ కళ్యాణం చేస్తారు. రెండు రోజుల పాటు ఈ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నండి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.