స్వామి అగ్నివేశ్ కన్నుమూత

న్యూఢిల్లీ : ఆర్య సమాజ్ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 1939 సెప్టెంబర్ 21న ఎపిలోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి ఆగ్నివేశ్ జన్మించారు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో తాత వద్ద పెరిగారు. కోల్కతాలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్లో పట్టా పొందారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు (2004-2014) కొనసాగారు. కాగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అగ్నివేశ్ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్ రావు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్గఢ్లో తాత వద్ద పెరిగారు. కోల్కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అగ్నివేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సిఎం కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులని ఎపి సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.