10న హాలియాలో కెసిఆర్ బహిరంగ సభ

హైదరాబాద్ : ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంట 30 నిమిషాలకు నెల్లికల్లులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు సిఎం వెల్లడించారు. రూ.3 వేల కోట్లతో నెల్లికల్లు లిఫ్టుతోపాటు మరో 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఒకేచోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.