23 నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

హైదరాబాద్: ఈనెల (ఫబ్రవరి) 23, 24 ,25, 26వ తేదీల్లో ఐఐటి, ఎన్ఐటీ తదితర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్-2021 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. కాగా ఈ సంవత్సరం తెలంగాణలో 73,782 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు.
వీటిలో..
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిఇ, బిటెక్ (పేపర్ -1), బిఆర్క్ (పేపర్ -2) పరీక్ష నిర్వహిస్తారు.
- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల బి ప్లానింగ్ (పేపర్ 2బి) పరీక్ష వరకు ఉంటుంది.
కాగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన కొవిడ్-19 మార్గదర్శకాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది.
మార్గదర్శకాలు
- మాస్క్, గ్లౌజులు ధరించి పరీక్షకు హాజరుకావాలి. 100 ఎంఎల్ శానిటైజర్, నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలి.
- అడ్మిట్ కార్డుల్లో సూచించిన సమయానికే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించడం ఉత్తమం. ఉదయం సెషన్లో 7:30 నుంచి 8:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 2:00 నుంచి 2:30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- అడ్మిట్కార్డుతో పాటు, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి.
- విద్యార్థులు తమ హెల్త్ స్టేటస్తోపాటు, ఇటీవల ఎక్కడెక్కడ తిరిగారో సెల్ఫ్ డిక్లరేషన్లో వెల్లడించాలి.
- సెల్ఫ్ డిక్లరేషన్పై పాస్పోర్ట్ సైజు ఫొటోను అతికించి, ఎడమ బొటన వేలి ముద్రను వేయాలి. సంతకాన్ని ఇన్విజిలెటర్ సమక్షంలో చేయాల్సి ఉంటుంది.
- బాల్ పాయింట్ పెన్నును పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
- తలకు టోపీలు, దుపట్టాలు, చేతులకు వాచ్లు ధరించడం నిషిద్ధం.
- చలువ కళ్లద్దాలు, గాగుల్స్ వంటి వాటిని అనుమతించరు.
- మందంగా ఉండే చెప్పులు, పెద్దపెద్ద బటన్లు ఉన్న దుస్తులు దరించరాదు.
- మొబైల్ఫోన్లు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులను అనుమతించరు.