560 మంది విద్యార్థులకు సచిన్ అండ
విద్య, పోషకాహారం అందించనున్నమాస్టర్

న్యూఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇప్పటికే అనేక స్వచ్ఛంధ సంస్థలతో కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మందికి అండగా నిలిస్తున్నారు. తాజాగా పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.. ఓ ఎన్టీజీవోతో చేతులు కలిపి 560 మంది విద్యార్థులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని మారుమాల గ్రామాల్లోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్లోని గిరిజన తెగలకు చెందిన చిన్నారులకు టెండూల్కర్ ఫౌండేషన్ పోషకాహారం, విద్యను అందించనుంది. ఎన్టీఓ పరివార్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సచిన్ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. యూనిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా సచిన్ కొనసాగుతున్నాడు. ఇప్పటికే పిల్లలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇటీవల ముంబైలోని ఎస్ఆర్సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పలువురు నిరుపేదలకు చిన్నారులకు ఆర్థిక సహకారం అందించాడు. 2019 డిసెంబర్లో టెండూల్కర్ ‘స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ దియా ఫౌండేషన్‘ ద్వారా డిజిటల్ తరగతి గదులను నడపడానికి గ్రీన్ ఎనర్జీని అందించడానికి సౌర లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ముంబైలోని భివాలిలోని శ్రీ గాడ్గే మహారాజ్ ఆశ్రమ పాఠశాలలో ఆధునిక లర్నింగ్ సదుపాయాలతో పాటు క్రీడల నిర్వహణకు వసతులు కల్పించాడు. క్రికెట్ దిగ్గజం అట్టడుగు వర్గాలకు చెందిన చిన్నారులను ఆదుకునేందుకు ముందుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.