మెజార్టీతో వాణీదేవిని గెలిపించండి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్నగర్ పట్టభద్రుల తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవీ సమన్వయ సమ్మేళనంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇంతమంది బ్రాహ్మణులను ఒకే వేదికపై చూస్తుంటే జ్ఞాన సరస్వతిని చూస్తున్నట్టు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ బ్రాహ్మణుల కోసం సిద్దిపేటలో ప్రత్యేకంగా బ్రాహ్మణ సదన్ ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన ధార్మికుడు సీఎం కేసీఆర్. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ వెయ్యి కోట్లతో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు.
వాణిదేవీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాణిదేవి నిగర్వి, నిరాడంబురాలు, గొప్ప విద్యావేత్త అని తెలిపారు. వాణిదేవీ తన విద్యాసంస్థల నుంచి లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిందని గుర్తు చేశారు. బ్రాహ్మణుల అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్రావు పట్టభద్రులకు చేసిందేమీ లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.