AP: ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

విశాఖపట్నం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని, రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశ ముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గురువారం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. వీటి కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ద్రోణి ఈ నెల 21 (శనివారం) నాటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయి.