34 ఏళ్ల క్రితం జరిగిన ఘర్షణ.. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష
ఢిల్లీ (CLiC2NEWS): పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1988లో జరిగిన ఘటనలో సిద్ధూను రూ. 1000 జరిమానాతో విడిచి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.
1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంపై 65 ఏళ్ల గుర్నామ్ సింగ్కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుర్నామ్ సింగ్ను కారు నుండి బయటకు లాగి అతడి తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్ సింగ్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ కేసులో 1999లో పటియాలాలోని సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాలు సరిగా లేవని పేర్కొంటూ సిద్ధూ, అతడి స్నేహితుడిని నిర్దోషులుగా ప్రకటించింది. బాధిత కుటుంబం సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. 2006 సిద్ధూను హైకోర్టు దోషిగా తేల్చి.. మూడేళ్లపాటు జైటు శిక్ష విధించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గుర్నామ్ సింగ్ను హత్య చేశారనేందుకు ఆధారాల్లేవంటూ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింద. కానీ, సీనియర్ సిటిజన్ను గాయపరిచినందుకు సిద్దూకు జైలు శిక్ష లేకుండా రూ. 1000 జరిమానా విధించింది.