ఆర్టిసిలో డ్వాక్రా సంఘాల భాగస్వామ్యం: భట్టి విక్రమార్క

ఖమ్మం (CLiC2NEWS): ఆర్టిసిలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ లోని మహిళా శక్తి క్యాంటిన్, బస్సు షెల్టర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిఎం మాట్లాడుతూ.. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శమని, వడ్డీలేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. వాళ్లకు రూ.25వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టి తెలిపారు.
వడ్డీలేని రుణాల పంపిణీ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టిసిలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, మరికొద్ది రోజుల్లో డ్వాక్రా మహిళలు బస్సు యజమానులుగా మారతారన్నారు. వాళ్లకు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆర్టిసి బస్సులు కొనుగోలు చేయిస్తామని, ఆ వాహనాలను ఆర్టిసికి అద్దెకు ఇప్పిస్తామన్నారు. అంతేకాకుండా మహిళల భాగస్వామ్యంతో ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.