పాఠశాలల్లో ఆధార్ అప్డేట్..
UDAI: పిల్లల బయోమెట్రిక్ పాఠశాలల్లోనే అప్డేట్ చేసే విధంగా ఉడాయ్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ మేరకు ఉడాయ్ సిఇఒ భువనేశ్ కుమార్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5 ఏళ్లు దాటిన ఆధార్ అప్డేట్ చేయించుకోని చిన్నారులు 7 కోట్ల మందికి పైగా ఉన్నారని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. వీరికోసం వారి చదివే స్కూళ్లలోనే దశలవారీగా బయోమెట్రిక్ అప్డేట్ చేసే విధంగా చర్యలు చేపడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపనుంది. ప్రస్తుతానికి దీనికి కావాల్సిన సాంకేతికను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. మరో 45 నుండి 65 రోజుల్లో ఇది సిద్దమవుతుందన్నారు. అదే విధంగా 15 ఏళ్లు పూర్తయిన వారికి రెండో తప్పనిసరి బయోమెట్రిక్ (ఎంబియు) కోసం కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం 7 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎంబియు పూర్తి చేయకపోతే ఆధార్ డీయాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకం అయినందున ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఆధార్ తప్పనిసరి. అందుకే పాఠశాలలు, కాలేజీల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. స్కూల్ అడ్మిషన్, నగదు బదిలీ పథకాలు, స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు పొందాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి.
5 నుండి 7 ఏళ్లు మధ్య చిన్నారులకు ఆధార్ అప్డేట్కు ఎలాంటి ఛార్జ్ చెల్లించాల్సి అవసరం లేదని ఉడాయ్ పేర్కొంది. ఏడేళ్లు దాటిన వారికి మాత్రం నామమాత్రపు రుసుం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.