స్కిల్ వర్సిటీకి అదాని గ్రూప్ రూ.100 కోట్ల విరాళం
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటికి అదాని గ్రూప్ భారీ విరాళం అందించింది. అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
బేకరికంచెలో సొంత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుండి ప్రవేశాలు కల్పించనున్నారు. దీనికోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. నవంబర్ 4 వ తేదీనుండి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి క్రమంగా కోర్సులు పెంచనున్నట్లు సమాచారం.