ఇడ్లీ అమ్మకు ఇల్లు.. మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా
ఒక్కరూపాయకే ఇడ్లీలు అమ్మే బామ్మకు ఇచ్చిన మాటను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా మాటనిలబెట్టుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఆమెకు కొత్త ఇంటిని కానుకగా అందజేశారు. తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్ 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న విషయం తెలిసినదే. ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా వంటగ్యాస్కు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పారు. ఆమెకు సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. నేటితో హామీని నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాతృదినోత్సం నాటికి ఇడ్లీ అమ్మకు సొంత ఇంటిని బహుమతిగా అందించేందుకు సకాలంలో పనులు పూర్తి చేసిన మా బృందానికి కృతజ్ఞతలు, ఆమె.. నిస్వార్థం, దయ తదితర మాతృత్వ సద్గుణాల స్వరూపం. అమ్మకు, ఆమె పనికి మద్దతు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాం. అందరికీ హ్యాపీ మదర్స్డే అని ట్వీట్ చేశారు.