AP: మధ్యాహ్నం గం.12 తర్వాత అన్నీ బంద్
ఎపి కేబినెట్ భేటీ... కీలక నిర్ణయాలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది… కోవిడ్ కేసుల పెరుగుదలను బట్టి పగలు 12 గంటల నుండి కూడా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోకరోనా కట్టడి నబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి తలపెట్టిన డే కర్ఫ్యూ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో కర్ఫ్యూ సహా, పలు అంశాలను చర్చించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు అనుమతి ఉండనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయనున్నామని వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ సర్వీసులు, అంతర్రాష్ట్ర, దూరప్రాంత సర్వీసులు కూడా నిలిపి వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలు..
- ఉ.6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి.
- 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు.
- ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సమస్య పరిష్కారినికి ప్రత్యేక చర్యలు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్ రప్పించే చర్యలు
- బిసి రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు
- మే 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ. దీనివల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
- మే 25న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నగదు జమ. దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది.
- మే 18న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు జమ. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం.
- 7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్కు కేబినెట్ ఆమోదం. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్కు అంగీకారం. ‘‘పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం’’ అన్నారు మంత్రి.
- పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. ‘‘2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు.
- ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.
- ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్కు లీజుకివ్వడానికి నిర్ణయం. 708 గ్రామాల్లో అమూల్ సేవలు.
- ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
- పట్టా రైతులతో సమానంగా అసైన్డ్దారులకు కూడా భూ సేకరణ పరిహారం.
- రూ.511.79 కోట్లతో 176 పీహెచ్సీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్సీలు.
- ప్రతి పాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం.
- ఏలేరు-తాండవ లింక్ కెనాల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- 45 ఏళ్లు పైబడిని వారికి వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం.