AP Curfew: మళ్లీ పొడిగింపు
అమరావతి (CLiC2NEWS): కరోనా రోజువారి కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గినా కానీ ఇంకా పాజిటివ్ కేసులు భారీగానే వస్తుండటంతో కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపత్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యానాథ్ సహా పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం సడలింపులు ఉండగా.. ఆ సమయాన్ని కూడా యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో సర్కార్ ఈ నెల 5న పగటి కర్ఫ్యూని అమల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. తరువాత కేసులు సంఖ్య తగ్గకపోవడంతో ఈ నెలాఖరువరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా సమీక్ష చేసిన సిఎం కర్ఫ్యూను జూన్ 10వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.