పిల్లలను సరిగా స్కూల్కి పంపితే ‘అమ్మఒడి’ వర్తిస్తుంది: మంత్రి బొత్స
విజయనగరం (CLiC2NEWS): నగరంలోని అమృత్ పథకంలో భాగంగా రూ. 1.96 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విజయనగరంలో ప్రతి ఇంటికీ వాటర్ కలెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. ఇంటర్లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని, ఈ పథకానికి 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ‘అమ్మ ఒడి’ లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని, పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపితే పథకం వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.